జీవుడు' అంటే?

 

జీవుడు అంటే?

జీవిలోనే దేవుడు ఉంటాడని, జీవుడు- దేవుడు కలిసి ఉన్న ప్పుడే మానవ జీవితానికి పరిపూర్ణత్వం సిద్ధిస్తుందని ముండకోపనిషత్తు తెలియజేసింది. శరీరం ఒక దేవాలయంగా భావించినప్పుడు ఆ దేవాలయంలో ఉండే దేవుడు జీవుడు. అందు కే దేవుణ్ని జీవాత్మ, భగవంతుణ్ని పరమాత్మ అని తత్వవేత్తలు సంబోధిస్తుంటారు.

భక్త కవులు తమ కవిత్వాల్లో జీవుణ్ని పరమా త్మ అంశగా అభివర్ణిస్తుంటారు. గోస్వామి తులసీదాసు అదే అభిప్రా యంతో సులభ శైలిలో ఈ పద్యం చెబుతాడు.
ఈశ్వర్‌ అంశ్‌ జీవ్‌ అవినాసీ
చేతన్‌ అమల్‌ సహజ్‌ సుఖ్‌ రాసీ
సో మాయాబస్‌ భయవ్‌ గోసాయీ
బంధ్యో కీర్‌ మరకట్‌ కీ నాయీ
భగవంతుని అంశ అయిన జీవుడు, చైతన్యవంతుడు… నిర్మ లుడు… సుఖసంపన్నుడు… అమరుడు. మాయలో చిక్కుకున్న ఆ జీవుడు చిలుక, వానరం (కోతి) వలె తనను తాను బందీగా చేసు కుంటాడు. ఆ బంధంలో పడిన జీవుడు అదే పరమ సుఖంగా భావించి అందులోనే ఉండిపోతాడు. శారీరక ఇంద్రియాలకు బాని సగా మారిన మనిషి తనలోని పరమాత్మను తెలుసుకోలేడు అం టాడు కవి. జీవాత్మలోనే పరమాత్మ ఉంటాడని తెలుసుకోలేని వారు భగవంతుని కోసం బయట వెదుకుతుంటారు అంటాడు కబీరుదాసు. కస్తూరి మృగం స్వభావాన్ని ఉదహరిస్తూ కస్తూరి మృగం సుగంధ భరితమైన కస్తూరిని విడుదల చేస్తుంది కానీ ఆ పరిమళం తనలోనుండే వస్తుందని గుర్తించలేక తన ముక్కు పుటా లను మీటే సుగంధం కోసం అడివంతా గాలిస్తుంటుంది.
దేవాలయం అనే శరీరంలో ఉండే జీవుడే దేవుడు. అంతేగాని జీవుడూ దేవుడు వేరుకాదు అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిం చిన జగద్గురు ఆదిశంకరాచార్యులు ”మానవుడు తన స్వరూపాన్ని మాత్రమే గుర్తిస్తాడు కానీ శరీరంలోని నిజ స్వరూపమైన సృస్వ రూపాన్ని కనుగొనలేడు” అంటూ ఓ చక్కని ఉదాహరణ చూపు తాడు. ”ఒక సింహంపిల్ల తప్పిపోయి గొల్లవానికి దొరుకుతుంది. అతడు దానిని తన గొఱ్ఱల మందతోపాటు పెంచగా, కొంచెం పెద్ద దవుతుంది. గొఱ్ఱలతో తాను ఒక గొఱ్ఱను అనుకొనేది. అలాగే ప్రవ ర్తించేది కూడా! ఒకసారి గొఱ్ఱలన్నీ అడవిలో మేస్తుండగా నట్టడవి నుంచి సింహం వచ్చి ఆ మందపై పడుతుంది. గొఱ్ఱలన్నీ పారి పోతాయి. గొఱ్ఱవలె పెరుగుతున్న ఆ సింహపు పిల్ల కూడా వాటితో పాటు పారిపోతుంది. అడవి సింహం చూసి ఆశ్చర్యపడి పరిగెత్తే సింహపు పిల్లను ఆపగా అది ”చిన్న గొఱ్ఱను నన్ను చంపకయ్యా” అంటూ వణుకుతూ బ్రతిమలాడుతుంది. అడివి సింహం నవ్వు తూ దాన్ని ఓ కొలను వద్దకు తీసుకెళ్ళి నీటిలో తన ప్రతిబింబాన్ని చూపుతుంది. పిల్ల సింహం, అడివి సింహం వలె తన మూతిపై ఉన్న మీసాలను చూస్తుంది నీటిలోని ప్రతిబింబంలో. అప్పుడు గాని ఆ సింహపు పిల్లకు తాను గొఱ్ఱను కానని అర్థంకాదు. అప్పుడు ఎదుట ఉన్న సింహం వలె గర్జించడం మొదలుపెడుతుంది. ఇక్కడ పిల్ల సింహానికి కొత్తగా వచ్చింది స్వస్వరూప జ్ఞానమే కానీ స్వరూ పం (శరీరం) కాదు. అంటే ఆ పిల్ల సింహానికి నిజంగా తానెవరో తెలుస్తుంది. మానవులందరూ ఆత్మస్వరూపులనే జ్ఞానాన్ని తెలుసు కోలేకపోతున్నారు. తాము వేరు, భగవంతుడు వేరు అనే భావనతో ప్రవర్తిస్తున్నారని ఆదిశంకరుల అభిప్రాయం.
రమణ మహర్షి కూడా ”నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు నీలో ని అంతరాత్మను చూడగలవు. ఆ అంతరాత్మలోని పరమాత్మున్ని కనుగొనగలవు” అంటాడు. భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ”భగ వంతుడు సర్వాంతర్యామి. అంతటా అన్నింటిలో, అందరిలో కొలు వై ఉంటాడని తెలుసుకోలేని అజ్ఞానులు అహంకారంతో మదాం ధులై విర్రవీగుతున్నప్పుడు సర్వాంతర్యామి ఏదో రూపంలో వచ్చి వారిని సంహరిస్తాడు” అని హిరణ్యకశిపుని ద్వారా తేటతెల్లం చేస్తుంది. హిరణ్యకశిపుడు తాను వేరు, భగవంతుడు వేరు అను కొని అహంకారంతో విర్రవీగుతూ కొడుకని చూడకుండా ప్రహ్లాదు న్ని అనేక హింసలకు గురిచేస్తుంటాడు. అంతేగాక ”ఎక్కడరా, నీ నారాయణుడు’ అంటూ హేళన చేస్తుంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ”ఇందుగలడందులేడని సందేహంవలదు… ఎందెందు వెదికి చూసిన అందందే గలడు…” అంటూ ఆ దురహంకారికి నర్సింహు డిచే తగిన శాస్తి చేయిస్తాడు.
భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో కృష్ణుడు అర్జునికి భగవాణుడు ఎక్కడుంటాడో చెబుతూ ”పార్థా, అన్ని జీవుల హృద యాల్లో ఈశ్వరుడు తిష్ట వేసుకొని కూర్చున్నాడు. సకల జీవులను మాయ అనే యంత్రాన్ని ఎక్కించి కిందికి మీదికి తిప్పుతుంటాడు. ఆ మాయ నుంచి రక్షింపబడాలంటే నువ్వు అహంకార మమ కారాలు వీడి పరమాత్ముణ్ని నిండు మనస్సుతో ధ్యానించు, ప్రేమ, సహృదయత, ఆత్మ సమర్పణాభావం, పరోపకార సంసిద్ధత ఉన్నచోట భగవాణుడు కొలువై ఉంటాడు” అంటా డు. దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు, నిరామయుడు, నిరంజ నుడు, సత్యశుద్ధ స్వరూపుడు కాబట్టి అన్ని రూపాల్లోనూ, అన్ని సుగుణాల్లోనూ ఆయనే ఉంటాడు. కాబట్టి ప్రతి మనిషి దైవీ గుణాలు కలిగుండాలి.

మానవుడు దేవుడు కావాలి అంటే ప్రతి ఒక్కరు మానవత్వం లో దైవత్వాన్ని చూడాలి. అసూయ ద్వేషాలు లేకుండా ప్రేమ, దయ కలిగుండాలి. నలుగురికి చేతనైనంత సాయం చేస్తూ తోడ్పడాలి. ఎప్పుడైతే ఇలాంటి ప్రవర్తనారీతులు వ్యక్తుల్లో అలవడుతాయో ప్రతి మనిషి దేహం దేవాలయమై అందులో ఉండే జీవుడు దేవుడవుతాడు.

బొమ్మ-బొరుసు” అన్నవి ఒకానొక నాణేనికి రెండు ముఖాలు! అలాగే “జీవుడు-దేవుడు” అన్నవి ఒకే ఒక జీవితానికి రెండు కోణాలు. “బొమ్మ-బొరుసు” కలిసినప్పుడే నాణేనికి విలువ ఉన్నట్లు .. “జీవుడు-దేవుడు” కలిసినప్పుడే మన జీవితానికి పూర్ణత్వం అనే విలువ సిద్ధిస్తుంది. ఈ పరమసత్యాన్ని ముండకోపనిషత్తు తెలియజేస్తుంది.

ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్యానాన్ని అన్యో అభిచాకశీతి

“ఒకే చోట పుట్టిన రెండు బంగారు పక్షులు .. ఒకే వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయి. అందులో క్రింది కొమ్మల్లో ఉన్నపక్షి .. తీపి – చేదు, పులుపు-వగరు, పండు-పచ్చి పళ్ళను తింటూ రకరకాల విన్యాసాలను చేస్తూంటే .. పై కొమ్మల్లోని పక్షి వాటన్నింటినీ ఒక సాక్షిలా చూస్తూ ఉంది.

“ప్రవర్తనలో తనకు భిన్నంగా ఉన్న ఆ పక్షి సంగతి తేల్చుకుందామని పై కొమ్మలకు వెళ్ళిన క్రింది కొమ్మల పక్షి .. ‘అక్కడ ఉన్నది నా ప్రతిరూపమే కానీ వేరొక పక్షి కాదు’” అని తెలుసుకుని ఆశ్చర్యపోయింది!

అలాగే ఒకే పూర్ణాత్మ నుంచి జన్మ తీసుకుని .. జీవితం అనే వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్న “జీవుడు/దేవుడు” అన్న మనం కూడా జీవుడిగా దేహస్థితిలో రకరకాల కర్మవిన్యాసాలను చేస్తూ .. దేవుడుగా ఆత్మస్థితిలో వాటిని ఒక సాక్షిలా చూస్తూ ఉంటాం!

ఇలా ఏక కాలంలో ఒకే మనంగా జీవిస్తూన్న మన రెండు జీవితాలలోని “జీవవత్ కర్మపూరిత కోణం” బయటికి కనపడితే .. “సాక్షివత్ కర్మాతీత కోణం” మాత్రం బయటికి కనబడకుండా ఉంటుంది. మనం మాట్లాడే మాటలను మనమే వింటూన్నట్లు .. దేహస్థితిలోని జీవుడిలా మనం ఎలా జీవిస్తున్నామో .. ఏ పరమార్థం కోసం కర్మలను చేస్తున్నామో .. ఆత్మస్థితిలోని దేవుడిలాంటి మనకే తెలుస్తుంది.

ఈ సంగతిని మరచిపోయిన మనం .. జీవుడిలా మానవ జీవిత అనుభవాలను పొందే క్రమంలో ఒక్కోసారి అరిషడ్వర్గాలతో సమన్వయం పొందలేక చతికిలబడిపోయి .. మనలోని దైవత్వాన్ని మరిచిపోయి .. “దేవుడెక్కడ? .. దేవుడెక్కడ?” అంటూ పుణ్యతీర్థాలకు పోయి అక్కడ మన గురించి మనమే వెతుక్కుంటూ ఉంటాం!

ఈ గందరగోళం నుంచి బయటపడాలి అంటే .. ప్రతిక్షణం మనం ధ్యానసాధనలో ఉంటూ మనలోని దైవత్వంతో మమేకం కావాలి.

నిరంతర విద్యార్థిలాగా జీవన విధాన శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేస్తూ .. జీవితాన్ని హాయిగా అనుభవించాలి. ప్రాపంచికంగా “నేను అదీ”, “నేను ఇదీ” అన్న అజ్ఞానపు గుర్తింపులను ఒకింత వదులుకుని .. కళ్ళు రెండూ మూసుకుని ధ్యానం ద్వారా అంతరంగంలోకి ప్రయాణం చెయ్యాలి!

అక్కడ అజ్ఞాతవాసం చేసి స్వీయ ఆత్మయొక్క విరాట్ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ప్రతి క్షణం ప్రతి ఒక్కరి దగ్గరినుంచీ నేర్చుకుంటూ మన లెక్కప్రకారం మరి మన ఇష్టప్రకారం మనం జీవించాలి.

మన వల్ల అందరికీ మేలు జరిగే పనులు చేస్తూ ఒక మాస్టర్‌లా నడుచుకోవాలి!

 

 సాధకులకు గమనిక :  భయస్థుడు అభయప్రదాతను వెతుక్కోవాలి. శరణు వేడాలనుకున్నవాడు శరణ్యుడెవడో కనుక్కొని అతని సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, జీవుడూ, దేవుడూ ఒక్కటేనని కూర్చుంటే ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు! ముఖ్యంగా ఆధ్యాత్మికతలో ఇలాంటి వైఖరి వల్ల సాధన కుంటుపడుతుంది. దైవం సర్వోన్నతమనే భావనతో దేహీ అన్న నాడు.. పరమాత్మ అనుగ్రహం వర్షంలా కురిపిస్తాడు. “నేను’ అనే దేహబుద్ధి ఉన్నంత వరకు, ‘నేను సేవకుడు’, ‘అతడు ప్రభువు’ అనే దాస్య భావం కలిగి ఉండటం మంచిది’ అని రామకృష్ణ పరమహంస తన శిష్యుడు నరేంద్రునితో అన్నమాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.

 

సృష్టి రహస్యమొకటి అర్ధమైతే అంతా అర్ధమయినట్టే మానవుడికి. అదే అంతుపట్టటం లేదు. అది భేదించడానికే మన ప్రాచీనులైన మహర్షులెంతగానో పరిశోధనలు చేశారు. అందరూ ఒకచోట సమావేశమై "కిమ్ కారణం బ్రహ్మ కుతఃస్మ జాతాః "  మనమంతా ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళుతున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, మనం సుఖం కోరితే దుఃఖమెందు కెదురవుదున్నదని ఇలా జీవిత సమస్యలను గూర్చి చర్చ సాగించారు. వాటికి సమాధాన మొకడు కాలమంటే, ఒకడు స్వభావమంటే, ఒకడు నియతి అంటే, ఒకడు యదృచ్ఛ అంటే, ఒకడిదంతా మన ప్రయత్నమేనంటే ఇలా ఎవరికి తోచినట్లు వారు చెబుతూ పోయారు.

అప్పుడు సభాధ్యక్షుడు లేచి ఇవి ఏవీ గావుకారణం. ఎందుకంటే కాలాదులు అచేతనాలు.  వాటికిది ఇలా చేయాలని సంకల్పం లేదు. పోతే మానవుడు చేతనుడైనా వాడి జ్ఞానం పరిమితం. ఇంత పెద్ద ప్రణాళిక వేయలేడు. కాబట్టి ఈ జీవ జగత్తులకు రెంటికి అతీతమైన శక్తి ఏదో ఉందది తెలుసుకోవాలని అందరూ కలసి మాటలు కట్టిపెట్టి ధ్యానంలో మునిగిపోయారు. పోగాపోగా వారికొక సత్యం భాసించింది. అది నిరాకారం నిశ్చలం సర్వవ్యాపకమైన చైతన్యం. అదే ఈకాల స్వభావాదులన్నిటినీ తనలో ఇముడ్చుకొని కనిపిస్తున్నది. ఎలా కనిపిస్తున్నదది?

ఏతద్ జ్ఞేయం నిత్యమే వాత్మసంస్థమ్. తమకు విషయంగా కాక తమ స్వరూపంగానే కనిపిస్తున్నది. అంతే గాక విషయప్రపంచం కూడా దానికి భిన్నంగా కాక దాని రూపంగానే దర్శనమిచ్చింది. 

భోక్తా భోగ్యం ప్రేరితారం చమత్వా, సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమే తత్. భోక్త అంటే జీవుడు. భోగ్యమంటే జగత్తు. ప్రేరిత అంటే వీటికి విలక్షణమని భావించే ఈశ్వరుడు. ఈ మూడూ మూడుగా గాక ఒకే ఒక ఆత్మచైతన్యంగా భాసించిందట. ఆ చైతన్యమే ఇన్ని రూపాలుగా మారి భాసిస్తున్నదని తెలుసుకొన్నారట చివరకు.

ఇదీ శ్వేతాశ్వతరమనే ఉపనిషత్తు మనకు బోధించిన ఒకానొక రహస్యం. అదేగాదు. అన్ని ఉపనిషత్తులు కూడా చెప్పే రహస్యమిదే. మానవ విజ్ఞానాని కంతటికి భాండాగారం లాంటిది వేదమైతే అ వేదానికి పర్యవసాన ముపనిషత్తు. అది మానవుడి అనుభవాన్ని అంతా విశ్లేషించి దానికొక తిరుగు లేని పరిష్కారంచేసి చూపింది. మన అనుభవంలో ఉన్న అంశాలు మూడే. ఒకటి మనకు నిత్యమూ కనిపించే ఈ ప్రపంచం. రెండు దీనికతీతంగా కనిపించకుండా ఎక్కడో ఉందని భావించే ఈశ్వరుడు. మూడు ఈ రెండు కొసలతో సంబంధం పెట్టుకొని బ్రతికే మనం. 

జీవజగదీశ్వరులనే ఈ మూడింటికీ తత్త్వత్రయమని పేరు. ఏకాలంలో ఏ మేధావంతు డాలోచించినా ఈ మూడింటిని గురించే ఆలోచించవలసింది. ఇంతకు మించి నాలుగవదంటూ లేదు మనమాలోచించవలసిన పదార్ధం. ఇందులో ఆలోచించి పరిష్కరించుకోవలసిన వాడటు ఈశ్వరుడూ కాదు. ఇటు జగత్తు కాదు. జగత్తు కేవల జడ పదార్ధం. ఈశ్వరుడు పరిపూర్ణ చైతన్యం. కాబట్టి ఇరువురికీ ఆ అవసరం లేదు.  పోతే అచేతనం కాక చేతనమైనా పరిపూర్ణంకాని మనబోటి జీవుడికే ఈ సమస్య. మనమే పరిష్కరించుకోవాలి. మనలోనే బాగా ఎత్తులకెదిగి చూడగలవాడెవడో వాడే ఋషి. వాడు దర్శించి మరలా మనకు శబ్దరూపంగా వెల్లడించిన అనుభవాలే ఉపనిషత్తులంటే.

ఏమిటి వారు దర్శించి చాటిన ఆ సత్యమంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు అని మూడు కావు !  వాస్తవంలో ఉన్నదొకే ఒక తత్త్వం. అది సర్వవ్యాపకమైన పరిపూర్ణమైన చైతన్యం. చైతన్యం గనుక అది స్వతసిద్ధం. స్వతసిద్ధం గనుక ఆత్మస్వరూపం. మరి ఈ అనాత్మ ప్రపంచమేదోగాదు. దాని ఆభాసే. అంటే అదే ఈ రూపంలో ఇలా భాసిస్తున్నదని అర్ధం. ఒక సువర్ణమే ఆభరణాల రూపంలో భాసించటం లేదా. అలాగే ఈ ఆభాసనే చూచి మూల వస్తువును మరచిపోయిన చైతన్య భాగమేదో అది జీవుడు. మరవకుండా చూస్తున్న చైతన్య మీశ్వరుడు. ఇవి మూడు కలసి ఆత్మచైతన్య విభూతేనను కొన్నవాడికిక ఏ సమస్య లేదు. వాడు ముక్తుడు. 
అలా అనుకోలేనంత వరకూ అన్ని సమస్యలు ఉన్నాయి. వాడు బద్ధుడు. 

అనుకోవటమే జ్ఞానం. అనుకోకపోవటమే అజ్ఞానం. ఆత్మజ్ఞానం మనకందించి అనాత్మ భావంనుంచి మనకు మోక్షం ప్రసాదించటానికే ఉపనిష ద్వాఙ్మయమంతా అవతరించింది . 


ఉపనిషత్తులనేవి ఒకటి గాదు. పదకొండు వందల ఎనిమిదున్నాయి ఉపనిషత్తులు. నాలుగు వేదాలకూ కలిపి అన్ని శాఖలున్నాయి. ప్రతి శాఖ అంతంలో ఒక ఉపనిషత్తు వస్తుంది. అంతంలో వస్తుంది కాబట్టి వేదాంతమని పేరు వచ్చిందుపనిషత్తుకు. అవి పదకొండు వందల ఎనిమిదయితే అందులో నూట ఎనిమిది చాలా ప్రశస్తం. శ్రీరాముడు హనుమంతుడి కానూటఎనిమిదీ బోధ చేసాడు. అందులోనూ పది ఉపనిషత్తులు సారభూతమైన వన్నారు. ఈశ కేన కఠ ప్రశ్నముండక మాండూక్య తిత్తిరి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్య మేవచ - అని వాటిని మన ప్రాచీనులు వర్ణించి చెప్పారు. ఈ అనాత్మ జగత్తంతా వట్టి ఆభాసే. వస్తువు కేవలమా ఈశ్వర చైతన్యమే. కాబట్టి ఆ ఈశ్వర భావనతో దీన్ని దర్శించండి. తన్మయంగానే కనిపిస్తుంది. తేన త్యక్తేన భుంజీథా - జగత్ ను  నామరూపాత్మకంగా వదిలేసి సచ్చిద్రూపంగా పట్టుకోవటమే మనం చేయవలసిన సాధన. సర్వము ఆత్మగా దర్శించి నపుడు కోమోహః కశ్శోకః - ఏకత్వమను పశ్యతః - అసలు ఏకత్వ భావనలో ఇక శోక మేముంది. మోహ మేముందని ఈశావాస్యం చాటుతుంది. ఎక్కడున్నాడా ఈశ్వరుడంటే ప్రాణస్య ప్రాణమ్ - మనసో మనొయత్ - మన ప్రాణ చలనమూ మనశ్చలనమూ - ఈ చలనాలు ఏ అచలం నుంచి ఏర్పడుతున్నవో ఆ అచలమైన చైతన్య మొకటి ఉండాలి గదా. అది వ్యక్తమూ గాదు. అవ్యక్తమూ గాదు. రెంటికి విలక్షణం. ప్రతిబోధ విదితం - దానిని ప్రతి ఆలోచనకూ ఆధార పీఠమనే భావనతో పట్టుకోవాలని కేనోపనిషత్తు సలహా. అందుకోసం ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్ని బోధత - లేచి వెళ్ళి పెద్దల నాశ్రయించండి. అనన్య ప్రోక్తేగతి రత్ర నాస్తి. ఆత్మ తత్త్వాన్ని దర్శించిన వారు కాబట్టి వారు నీకు ఆ అనుభవం ప్రసాదించగలరని చెబుతుంది కఠోపనిషత్తు. అది ఎలా ప్రసాదిస్తారు ఆ అనుభవమని అడిగితే్ నామాది ప్రాణాంతంగా షోడశ కలాత్మకమైన ఈ సృష్టి అంతా నిష్కలమైన ఆ పురుష తత్త్వం నుంచే వచ్చింది. కాబట్టి యధా నద్య స్స్యందమానా స్సముద్రే - తథా కలాః పురుషం ప్రాప్యాస్తం గచ్ఛంతి. గంగా యమునాది నదులన్నీ సముద్రంలో కలసి నామరూపాలు ఎలా వదిలేస్తాయో అలాగే ఇవన్నీ పురుష చైతన్యంలోనే లీనమై అది ఆత్మగానే మనకు ఏకంగా సాక్షాత్కరిస్తుంది. ఈ ప్రవిలాపనమే సాధన అని బోధిస్తుంది ప్రశ్నోపనిషత్తు. ఆ ఏకాత్మా నుభవమెలా ఉంటుందని అడిగితే బ్రహ్మ పశ్చాద్బ్రహ్మ పురస్తాత్ - బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్ఠం - నీవూ నీవు చూచే ఈ ప్రపంచమూ అంతా బ్రహ్మ స్వరూపమే అదిపరిపూర్ణమైన నీ చైతన్యమే. ఎక్కడ చూచినా ఏది చూచినా నీకు నీవే దర్శనమిస్తుంటావని చాటుతున్నది ముండకోపనిషత్తు. అప్పుడిక జాగ్రత్స్వప్నసుషుప్తులని మూడవస్ధలు గాక అంతా కలిసి ఒకేఒక తురీయావస్ధ గానే మారి గోచరిస్తుంది. ద్రష్టా దృశ్యమనే భేదం కూడా నశిస్తుందని మాండూక్యం చెప్పేమాట. అయితే అదే ఆఖరు మాట లయినా దేహాత్మాభిమాన మున్నంత వరకూ ఒక్కసారిగా అది అనుభవానికి రావటం కష్టసాధ్యం. కనుక అన్న మయాది పంచ కోశాలను ఒక్కొక్క పొరలాగా విప్పుకొంటూ పోయి ఆనందమయ కోశంకూడా దాటి చివరకు కోశాలన్నీ నాకు వేరుగావు - నా స్వరూపమేనని ఉపాధులను కూడా చైతన్యంలో కలుపుకొని చూస్తే సమకూరుతుం దంటుంది తైత్తిరీయోపనిషత్తు. ఆత్మనెప్పుడు గాని వ్యష్టిగా కాక సమష్టిగా చూడటం నేర్చుకోవాలి. దృషిని సమష్టి మీదకి మళ్ళించటానికే ఈ జీవజగద్రూపమైన సృష్టినంతా ఒక సంకేతంగా వర్ణించింది శాస్త్రమని శాస్త్రరహస్యం విప్పి చెబుతుంది ఐతరేయం. అది గ్రహిస్తే అప్పుడు త్వం పదార్ధమైన నీవు లేవు. సమష్టి రూపమైన తత్పదార్ధమే నీవని తత్త్వమసి సూత్రం బయట పెడుతుంది ఛాందోగ్యం. పోతే అది గట్టి చేసుకొంటే చాలు నీవిక చేయవలసిన అభ్యాసం బాహ్యంగా ఏదీలేదని ఉపదేశిస్తుంది అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతం ద్వారా ఆఖరిదైన బృహదారణ్యకం.

ఇంతకూ ఏ ఉపనిషత్తు ఎలా బోధించినా సారాంశమొకటే. అది ఈ అనేకత్వంలో నుంచి మన బుద్దినేకత్వం వైపు మళ్ళించటమే. అనేకమనేది నిజానికి ఏకత్వం నుంచి వచ్చిందే. ఆ ఏకత్వం ఎక్కడో లేదు. ఈ అనేకత్వంలోనే ఉంది మరలా. కాని అది మనకీ అనేకత్వం మీదనే దృష్టి ఉన్నంతవరకూ కనపడదు. ఆభరణాలలో బంగారం లాగా మరుగునపడి ఉంటుంది. దాని మూలంగా జీవుడూ, జగత్తూ, ఈశ్వరుడూ వేరయిపోయి అన్ని సమస్యలకూ అది దారితీస్తున్నది. ఇదీ సంసార బంధం. ఇది పరిష్కారం కావాలంటే మరలా అనేకత్వంలో దాగి ఉన్న ఆ ఏకైకమైన ఆత్మతత్త్వం మీద చూపు నిలిపి ఆ చూపుతో ఈ అనాత్మ ప్రపంచాన్ని దర్శించాలి. దర్శిస్తే అప్పుడీ నామరూపాత్మకమైన జగత్తంతా చైతన్యంలో కలిసి సృష్టి అంతా మన స్వరూపంగానే అనుభవానికి వస్తుంది. అదే బ్రహ్మానుభవం. ఆ అనుభవంలో ఇక జీవజగదీశ్వరులనే భేదమూ లేదు. తన్నిమిత్తమైన సమస్యా లేదు. మానవుడి విజ్ఞానానికి అనుభవానికి . రెంటికీ పరిపూర్ణత అది.

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి